హైదరాబాద్ వాసులకు ఝలక్ ఇస్తోన్న మెట్రో రైళ్లు..

హైదరాబాద్ వాసులకు ఝలక్ ఇస్తోన్న మెట్రో రైళ్లు..
X

వర్షాకాలం ట్రాఫిక్‌ ఇబ్బందులకు భయపడిన హైదరాబాద్‌ నగర ప్రయాణికులు.. మెట్రో జర్నీపై ఆసక్తి చూపిస్తున్నారు. రోడ్డు మార్గంలోని ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు ప‌డేకంటే అత్యంత వేగంగా గ‌మ్య స్థానాల‌కు చేర్చే మెట్రో రైల్ బెటర్‌ ఆప్షన్‌ అనుకుంటున్నారు. ఏడాదిన్నర కింద‌ట మియాపూర్ నుంచి నాగోలు వ‌ర‌కూ ప్రారంభ‌మైన మెట్రో రైల్‌కు ఆరంభంలోనే ఆద‌ర‌ణ అదిరింది. ఆ త‌ర్వాత అమీర్ పేట‌-ఎల్బీన‌గ‌ర్, అమీర్ పేట‌- హైటెక్ సిటీ మార్గాలు అందుబాటులోకి వ‌చ్చాయి. మొత్తం 56 కిలోమీట‌ర్ల మేర మెట్రో రైల్ న‌గ‌రంలో ప‌రుగులు పెడుతుండ‌గా ప్రయాణీకుల సంఖ్య కూడా అందుక‌నుగుణంగానే పెరుగుతోంది. నిత్యం 2 లక్షల 75 వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

ప్రస్తుతం నాగోలు- మియాపూర్ మార్గంలో ప్రతీ రెండున్నర నిమిషాల‌కు ఓ రైలు అందుబాటులో ఉండ‌గా, అమీర్ పేట‌- ఎల్పీన‌గ‌ర్ రూట్‌లో కూడా అదే టైమింగ్‌తో రైళ్ళు న‌డుస్తున్నాయి.

అమీర్ పేట్‌‌- హైటెక్ సిటీ మార్గంలో మాత్రం ప్రయాణీకుల క‌ష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రతీ ఎనిమిది నిమిషాల‌కు ఓ రైలు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే ఈ రూటులో రివ‌ర్సల్ స‌దుపాయం లేక‌పోవ‌డంతో పాటు సాంకేతిక కార‌ణాలతో ప్రతీ రోజూ ఏదో ఓ స్టేష‌న్‌లో మెట్రో ఆగిపోతోంది.

హైదరాబాద్ మెట్రో రైల్ ను కాలుష్యం భూతం భయపెడుతోంది. ఇప్పటి వరకూ మానవ, జంతు, జీవరాశులకు మాత్రమే భూతంగా తయారైన కాలుష్యం... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే యంత్రాల పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను రూపొందించారు. ఇంతటి ఉన్నత వ్యవస్థపై కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కాలుష్యం కారణంగా సిగ్నలింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్టేషన్లలో మెట్రో తలుపులుతెరిచుకోకపోవడం.. మరికొన్నిచోట్ల మధ్యలోనే తలుపులు తెరుచుకోవడం, అధిక వైబ్రేషన్, నెమ్మదిగా వెళ్లడంలాంటి సమస్యలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు మెట్రో రూట్‌లో ఉన్న ఫ్లెక్సీలు ఈదురు గాలులకు పట్టాలపైన పడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

Tags

Next Story