బామ్మ గారు మీరు సూపర్.. మీకు నేనే స్పాన్సర్ : ఆనంద్ మహీంద్ర

బంగ్లాదేశ్పై విక్టరీతో వరల్డ్ కప్ సెమీస్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ కు హాజరైన ఓ బామ్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. కోహ్లీసేన బంగ్లాదేశ్పై గెలిస్తే.. ఈ బామ్మ మాత్రం దేశం మనసుని గెలిచింది. ఆ ప్రత్యేక అభిమానే 87 ఏళ్ల చారులత పటేల్. ఆటపై మక్కువ ఉంటే వయసుతో సంబంధంలేదని నిరూపించిందీ పెద్దావిడ. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమె చిన్నపిల్లలా మారిపోయారు. బూర ఊదుతూ.. చప్పట్లు కొడుతూ.. ఆమె చూపించిన జోష్కు అటు ఆటగాళ్లు, ఇటు కామెంటేటర్లు ఫిదా అయ్యారు.
మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా.. చెంపలకు మువ్వన్నెల రంగులు వేసుకోని చేతిలో త్రివర్ణపతాకంతో ఈ బామ్మ తెగ సందడి చేసింది. మ్యాచ్ ఆద్యాంతం ఆమె టీమిండియాకు మద్దతు పలకడం అందరినీ ఆకట్టుకుంది. బామ్మగారి హడావుడిని టీవీలో పదేపదే చూపించడం, అభిమానానికి వయసుతో సంబంధంలేదని కామెంటేటర్స్ కొనియాడటం.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్శర్మ ప్రేక్షకుల గ్యాలరీలోకి వెళ్లి ఆ బామ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. కెప్టెన్ కోహ్లి ఆమెతో ఉన్న ఫొటోలను ట్విటర్లో పంచుకుంటూ.. మాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చారులతా గారికి స్పెషల్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఆమె వయసు 87 ఏళ్లు. క్రికెట్ పట్ల ఇంత పిచ్చి, అంకితభావం ఉన్న ఆమెలాంటి అభిమానిని నేను ఇంతవరకు చూడలేదన్నారు కోహ్లీ. వయసు ఒక సంఖ్య మాత్రమేనని, అభిరుచి అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుందని ఆమె ద్వారా తెలుస్తోందన్నారు. తదుపరి మ్యాచ్కు బామ్మ ఆశీర్వదాం తీసుకున్నాను అని ట్వీట్ లో క్యాప్షన్ గా పేర్కొన్నాడు కోహ్లీ.
ప్రస్తుతం 87ఏళ్ల చారులత గారి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 1983లో కపిల్ డెవిల్స్ లార్డ్స్లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా తాను గ్రౌండ్ లోనే ఉన్నానని చెప్పింది ఈ బామ్మ. మ్యాచ్ తర్వాత తన వద్దకు అభిమానంతో వచ్చిన కోహ్లి, రోహిత్లపై ఆప్యాయత కురిపిస్తూ భారత్ మళ్లీ టైటిల్ గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది. అటు ఈ బామ్మగారి జోష్ కు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర కూడా ఫిదా అయ్యారు. ఆ బామ్మ హాజరయ్యే తదుపరి మ్యాచ్ లన్నింటికీ తానే స్పాన్సర్ చేస్తానని ట్వీట్ చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com