రేపు ఆంధ్రప్రదేశ్ లో రైతు దినోత్సవం

ఏపీ వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ జాతర జరగనుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పెంచిన పెన్షన్లను రేపటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జులై 8వ తేదిన రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఇందులో భాగంగా రేపు జమ్మలమడుగులో జరిగే రైతుబంధు సభలో సీఎం జగన్ పాల్గోనున్నారు..
సీఎంగా బాధ్యతల చేపట్టిన తరువాత తొలిసారి సొంత జిల్లా కడపకు జగన్ వెళ్తున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా.. ఇడుపుల పాయలో తండ్రి సమాధికి నివాళులర్పించనున్నారు. తరువాత చక్రాయపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు.
ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలోని హెలీప్యాడ్ను కాంక్రీట్తో సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టభద్రత ఏర్పాటు చేశారు. గండి క్షేత్రంలో జగన్ సభ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహింతిలు పరిశీలించారు..
ఇడుపులపాయ కార్యక్రమం ముగిసిన వెంటనే జమ్మలమడుగు చేరుకుంటారు జగన్. అక్కడే బహిరంగ సభలో పాల్గొని.. రైతులకు మద్దతు ధర, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాలను ప్రారంభించనున్నారు. జమ్మల మడుగులో జరగబోయే ముఖ్యమంత్రి జగన్ రైతు బంధు సభ ఏర్పాట్లను వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు పర్యవేక్షించారు. అక్కడ ఏర్పాటు చేసే వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించి తరువాత వివిధ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com