రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరుమల పర్యటన వివరాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు రాష్ట్రపతి కోవింద్ తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5.25 గంటలకు చెన్నై నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం గుండా తిరుచానూరు చేరుకొని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. తరువాత 6.15 గంటలకు తిరుపతిలోని కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు అక్కడి నుంచి 7.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం5.40 నిమిషాలకు శ్రీ భూ వరహాస్వామి వారిని దర్శించుకుంటారు.
తరువాత 6 గంటలకు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆలయ మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయ ఆగమశాస్త్రం ప్రకారం రాంనాథ్ కోవింద్కు ఆలయ అర్చకులు ఇస్తీకపాల్ స్వాగతం పలుకుతారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి స్వామి వారి దర్శనం చేయిస్తారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం చేస్తారు. ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామి దర్శనం తరువాత పద్మావతి అతిథఙ గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com