తంతే గారెల బుట్టలో.. ఉద్యోగులకు రూ. 'లక్ష' బోనస్ మరి..

చేస్తున్న ఉద్యోగం బానేఉంది. అయినా మరో కంపెనీ ఆఫర్ ఊరిస్తోంది. ఇంకేముంది బాస్కి చెప్పాపెట్టకుండా చెక్కేయడమే. ఇలాంటి వలసలు అన్ని కంపెనీల్లో కంటే ఐటీ కంపెనీల్లో ఎక్కువ. మరి దీన్ని కట్టడి చేయకపోతే టాలెంట్ ఉన్న ఉద్యోగిని వదులుకోవలసి వస్తుంది. అలాంటి వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తే చేస్తున్న ఉద్యోగాన్ని మరింత ఇష్టంగా చేయగలుగుతారు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది కంపెనీ. అందులో భాగంగానే ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తన జూనియర్ ఉద్యోగులకు రూ.లక్ష బోనస్ ప్రకటించింది. కంపెనీలో జాయిన్ అయ్యి మూడేళ్ల అనుభవం వుంటే చాలు బోనస్ ఇచ్చేస్తారు. అయితే, బోనస్ తీసుకున్న ఉద్యోగులు కచ్చితంగా సంవత్సరం పాటు పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్ సౌరభ్ గోవిల్ తెలిపారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్పై సైన్ చేయాల్సి ఉంటుందని అన్నారు. నైపుణ్యాలు గలవారికి మంచి ఇంక్రిమెంట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక పనిలో ప్రావిణ్యం కనబరచని వారికి వేతన పెంపు లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com