చంద్రయాన్లో ఇది ఆరంభం మాత్రమే.. - ఇస్రో చైర్మన్ శివన్
ఇస్రో మరో చరిత్ర సృష్టిచింది. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. కోట్లాది మంది భారతీయుల కలలను, ఆశలను మోసుకుంటూ.. జీఎస్ఎల్వీ-మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. శాస్త్రవేత్తలు, భారతీయుల కళ్లల్లో ఆనందం వెల్లి వెరిసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అద్భుత విజయం సాధించింది. తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. గురి తప్పకుండా వదిలినా చంద్రయాన్-2 బాణం ఆకాశంలోకి పరిగెత్తింది. అన్ని సాంకేతిక సమస్యలను అధిగమించి...సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్.. జాబిల్లి వైపు దూసుకెళ్లింది.
వాస్తవానికి ఈనెల 15న 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి ఈ ప్రయోగం ఆగిపోయింది. ఆ లోపాన్ని వారంలోనే సరిచేసిన శాస్త్రవేత్తలు సక్సెస్ సాధించారు. 20గంటల కౌంట్ డౌన్ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్-2 ఉపగ్రహం.. కేవలం 16 నిమిషాల 31 సెకన్లు ప్రయాణించి కక్ష్యలోకి చేరింది. భూమికి దగ్గరగా 170కిలో మీటర్లు.. భూమికి దూరంగా 39 వేల 120 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్-2ను విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశిస్తుంది. సగటున 3 లక్షల 84 వేల కిలో మీటర్లు ప్రయాణించనున్న ఉపగ్రహం సెప్టెంబర్ 7న చంద్రునిపై దిగనుంది.
చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మార్క్-3 విజయం కొత్త ఉత్సాహం నింపిందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. చంద్రయాన్లో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని.. సెప్టెంబర్ 7 రాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com