రూ.15వందలకు దొరికే ఇసుక ఇప్పుడు 6వేలు అయింది : చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షనేత ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. 45 ఏళ్లవారికి పెన్షన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నందుకు ముగ్గురు టీడీఎల్పీ నేతలను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ నిర్ణయంపై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బీసీ నేత అచ్చెన్నను సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టారని అన్నారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సభను కొనసాగిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు..
రైతులకు 12వేల 500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు కేంద్రం సగం, రాష్ట్రం సగం ఇస్తామంటున్నారని విమర్శించారు చంద్రబాబు. మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. 20 వేల కోట్లు టోకరా వేస్తున్నారని ఆరోపించారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలకు 3వేల 500 కోట్లు అవుతుందని చెప్పి.. బడ్జెట్లో కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు..
అమరావతి ప్రాజెక్టును నాశనం చేశారని, రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. వచ్చే పెట్టుబడులు కూడా వెనక్కుపోతున్నారని దయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక దొరకడం లేదని, దీంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు చంద్రబాబు. గతంలో 15వందలకు దొరికే ఇసుక ఇప్పుడు 6వేలు ఉందన్నారు. నిర్మాణ రంగం కుదేలు అయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు..
అటు తన ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్న మూడు చానల్స్పై కూడా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని మండిపడ్డారు చంద్రబాబు. ఇలాంటి ధోరణి ప్రభుత్వనికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com