బుడతడు ఎంత పనిచేశాడు
పిల్లలకు ఏ ప్రదేశమైనా ఆట స్థలంగానే కనిపిస్తోంది. ఇంట్లో ఉంటేనే వారు మన చేతుల్లో ఉండరు. ఇక బయటకు వెళితే వారికి అడ్డే ఉండదు. ప్రతి క్షణం వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారికి ఆటలు సరదానే కావచ్చు కొన్ని సమయాలలో అవి విషాదంగా మారుతాయి. పేరెంట్స్కు తీరని శోకాన్ని మిగులుస్తాయి. తాజాగా అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో ఓ బుడుతడు మృత్యు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు. సిబ్బంది అప్రమత్తతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఎడిత్వెగా అనే మహిళ అట్లాంటా నుంచి తను నివసిస్తున్న పట్టణానికి వెళ్ళడం కోసం తన కుమారుడిని వెంటబెట్టుకుని విమానాశ్రయానికి చేరుకుంది. బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు ఆమె కౌంటర్ వద్ద వేచివున్న సమయంలో ఆమె కొడుకు అదృశ్యమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో గమనించే లోపే ఆ బాలుడు సామగ్రి తనిఖీ బెల్టుపై ఎక్కేశాడు. దీంతో పిల్లాడిని ఆపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను అనుమతించలేదు. అప్పటికే బాలుడు బెల్టుపై ఎక్కి తనిఖీలు చేసే స్కానింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సిబ్బంది చెప్పడంతో వారు బెల్టును ఆపేశారు. అనంతరం సిబ్బంది లోపలికి వెళ్లి బాలుడిని బయటికి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు బాలుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో.. పిల్లల పట్లతల్లిదండ్రుల అప్రమత్తత ఎంత అవసరమో ఈ సంఘటన చెబుతుంది. వారికి తెలియకపోవచ్చు ప్రతిదీ ఆట స్థలం కాదని.. కానీ అది మనకు తెలిసేలోపే ఏదైనా జరగవచ్చు కావున వారి పట్ల జాగ్రత్త చాలా అవసరం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com