మావోయిస్టుల పోస్టర్లు కలకలం..

తూర్పు ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో.. ముందస్తుగా పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో పాగా వేసేందుకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారనే కారణంతో.. చింతూరు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. PLGA వారోత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చింతూరుతోపాటు ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న అటవీప్రాంతలో అదనపు బలగాల్ని మోహరించారు.
ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మావోయిస్టు ఉద్యమంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ సభలు నిర్వహిస్తారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఈసారి కూడా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చింతూరు మండలం సరివెల వద్ద మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. దీంతో.. ఆగస్టు 3 వరకూ మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com