పవన్ కళ్యాణ్ సారథ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో తొలిసారిగా విజయవాడలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్ తోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుతోపాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు ప్రజల గొంతుక వినిపిస్తున్నారంటూ పవన్ ప్రశంసించారు. ప్రజా సమస్యలపై మరింత గళమెత్తి.. అసెంబ్లీ సాక్షిగా జనసేన పార్టీ పోరాటం చేయాలని ఆయన సూచించారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ.. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా జనసేన పనిచేయాలని సూచించారు. స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం ఏ కార్యకర్త పనిచేసినా సహించేది లేదన్నారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని పోరాటం చేసిన పార్టీ కార్యకర్తలకు, అభ్యర్థులకు, అభిమానులకు అఫైర్స్ కమిటీ అభినందనలు తెలిపింది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి మృతి చెందిన కార్యకర్త కొప్పినీడు మురళికి నివాళులర్పించింది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు జనసేన పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త నిస్వార్థంగా పనిచేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యక్తిగత అజెండాతో ఎవరూ ఉండొద్దని హితవు పలికారు. రాజకీయంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేయాలని ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలో నియోజకవర్గాల్లో ఇన్చార్జ్లను నియమించి.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com