అన్న క్యాంటీన్ల మూసివేత.. సర్కార్ క్లారిటీ..
ఏపీలో వైసీపీ సర్కారు.... గత ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా పక్కనపెడుతోంది. ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం పాడిన ప్రభుత్వం... ఇప్పుడు అన్న క్యాంటిన్లను టార్గెట్ చేసింది. 5 రూపాయలకే భోజనం పెట్టే ఈ క్యాంటీన్లు తాత్కాలికంగా మూసేసింది. రంగులు వేస్తున్నామని చెప్పి...నెల్లూరు జిల్లాలో క్యాంటీన్లన్నింటిని మూసేశారు. ఇవి మళ్లీ ప్రారంభిస్తారా లేదా అనుమానమంటున్నారు ఇక్కడి ప్రజలు..
నెల్లూరు జిల్లాలో మొత్తం 12 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేశారు. ఒక్క నెల్లూరు సిటీలోనే 8 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కేవలం ఐదురూపాయలకే కడుపు నింపుతున్నాయి ఈ క్యాంటిన్లు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఇవి ఉంటాయా ? ఉండవా? అనే అనుమానాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ముందుగా ఎన్టిఆర్ బొమ్మను తొలగించారు. ఆ తర్వాత రంగు మార్చి రాజన్న క్యాంటిన్లుగా పేరు మార్చారు. ఇప్పుడు... ఏకంగా మొత్తానికే ఎత్తేశారు.
దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. గత ప్రభుత్వం అనవసరమైన చోట్ల క్యాంటీన్లు ఏర్పాటుచేసిందని, అందుకే తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటుచేస్తామంటున్నారు. అయితే.. పేదలకు భోజనం పెట్టే ఈ క్యాంటిన్ల విషయంలో రాజకీయాలు చేయడమేమిటని విమర్శిస్తున్నారు ప్రజలు. పేరు మార్చినా? పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com