వరినాట్లు వేసి ఇంటికి వెళుతుండగా..

రోజు కూలీలను మృత్యువు క్షణాల్లో కబళించింది. రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవుల జీవితాలను బలితీసుకుంది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటున్న సమయంలో ఓ లారీ మృత్యువులా దూసుకొచ్చింది. 13 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యేలా చేసింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం పరిధిలోని జడ్చర్ల-కోదాడ ప్రధాన రహదారిపై ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది.

కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు శివారులోని వ్యవసాయ పొలాల్లో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అవ్వగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.. ఇంకా ఆ పరిసరాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగానికి తోడు అధికారుల అలసత్వంతో ఇంకెంత మంది ప్రాణాలు పోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Next Story