మెట్రోలో రెడ్ అలర్ట్.. అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ శాఖ

జమ్మూ కశ్మీర్ విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ అంతటా నిషేదాజ్ఞలు విధించారు. ఉదయం పూట 144 సెక్షన్, రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. ఇప్పటికే దాదాపు లక్ష మంది సైనికులను మోహరించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ , ఒమర్ అబ్దుల్లా, వేర్పాటువాద నాయకులను గృహనిర్బంధం చేశారు. కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఈ సాయంత్రం కశ్మీర్ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత శాంతియుత వాతావరణం పూర్తిగా కొనసాగే వరకూ బందోబస్తు కొనసాగించనున్నారు. యూపీ, ఒడిశా, అసోం నుంచి అదనపు బలగాలను కశ్మీర్ పంపనున్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ కోరింది. బీహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ సహా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రోలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. తెలంగాణలోని పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సునిశిత ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com