నేడు సీఎం కాళేశ్వరం పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.. నీటిని విడుదల చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు.. ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకు పయనమవుతారు.. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, గోలివాడ, ధర్మపురిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు.. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నదిని ప్రత్యక్షంగా వీక్షిస్తారు.
ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి.. దాదాపు 12 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎగువకు ఎత్తిపోశారు అధికారులు.. దీనికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.. క్షేత్రస్థాయి పర్యటనలో మేడిగడ్డ బ్యారేజ్, గోలివాడ పంప్హౌస్ను కేసీఆర్ పరిశీలించనున్నారు.. ఎల్లంపల్లి బ్యారేజ్ సందర్శించిన అనంతరం గోలివాడ పంప్హౌస్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేస్తారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com