స్నానాలకు నీళ్లు లేవని ఆడపిల్లల జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపల్

మెదక్ మినీ గురుకుల పాఠశాలలో ఆడపిల్లలందరికీ ప్రిన్సిపల్ జుట్టు కట్ చేయించడం కలకలం రేపింది. హాస్టల్లో సరిపడ నీళ్లు లేనందునే ఇలా చేశానని ప్రిన్సిపల్ అరుణ చెబుతున్నారు. స్నానానికి సరిపడ నీళ్లు రావడం లేనందున.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందంటున్నారు. జుట్టు కత్తిరించేందుకు ఒక్కొక్కరి నుంచి 25 రూపాయలు కూడా వసూలు చేసినట్టు పిల్లలు చెప్తున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రిన్సిపల్ తేలిగ్గా తీసుకున్నారు.
విద్యార్థినులకు క్షవరం చేయించిన ఘటనపై విచారణ జరుగుతోంది. ఐతే..తాను చేసిందే కరెక్ట్ అంటూ బీసీ వెల్ఫేర్ అధికారి సుధాకర్తో ప్రిన్సిపల్ అరుణ చెప్పడం గమనార్హం. మెదక్ పట్టణంలో ఉన్న ఈ మినీ గురుకులంలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ 182 మంది ఆడపిల్లలు చదువుతున్నారు. వీళ్లలో చిన్నపిల్లలకు కటింగ్ చేయించడం వరకు సర్ది చెప్పుకున్నా.. పెద్ద అమ్మాయిలకు కూడా క్షవరం చేయించడంపై విమర్శలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com