చంద్రబాబు ఇంటి దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేయాల్సిన అవసరమేంటి?
అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై బాబు నివాసం దగ్గర పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు ఇంటి దృశ్యాలు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు.
భారీగా టీడీపీ నేతలు చేరుకుని ఆందోళన చేయడంతో పోలసులు సైతం భారీగా చేరుకున్నాు. డ్రోన్ కెమెరాలతో షూట్ చేసిన ఇద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
డ్రోన్ కెమెరాలతో షూట్ చేసి.. బయట ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో తక్షణం తేల్చాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ వ్యవహారంపై స్టేషన్లో చర్చిద్దామని పోలీసులు చెప్పడంపైన టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో.. లాఠీ ఛార్జ్ చేశారు. టీడీపీ కార్యకర్తలను, నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో దాదాపు గంటపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
డ్రోన్ కెమెరా ద్వారా తన నివాస దృశ్యాలు షూట్ చేసిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైసెక్యూరిటీ జోన్లో డ్రోన్లకు ఎవరు అనుమతిచ్చారో చెప్పాలంటూ డీజీపీని ప్రశ్నించారు. ఎస్పీకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. చివరికి తన భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ వీడియోను తీసింది వాటర్వర్క్స్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బందని పోలీసులు చెప్పారు. ఇరిగేషన్ శాఖ కూడా తామే వాళ్లను పంపినట్టు వివరణ ఇచ్చింది. స్వయాన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దీనిపై వివరణ ఇచ్చారు. ఐతే.. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇలా కొత్త డ్రామాకు తెర తీసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు నివాసానికి చేరుకున్న వైసీపీ మంత్రులను సైతం టీడీపీ లీడర్లు అడ్డుకున్నారు. బొత్సా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ మంత్రుకుల, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com