యడియూరప్పకు హైకమాండ్‌ గుడ్‌న్యూస్‌

యడియూరప్పకు హైకమాండ్‌ గుడ్‌న్యూస్‌
X

ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్నాళ్లయినా ఇప్పటి వరకు కేబినెట్‌ కూర్పు చేయలేదనుకుంటున్న కర్నాటక సీఎం యడియూరప్పకు హైకమాండ్‌ నుంచి గుడ్‌న్యూస్‌ అందింది. మంత్రివర్గ ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. హైకమాండ్‌ పిలుపు అందుకుని ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఆశావహుల జాబితాను వారికి అందించినట్లు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే ఈనెల 19న మంత్రివర్గ ఏర్పాటు ఉండే అవకాశం కనిపిస్తోంది.

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 రోజులవుతోంది. మొదట సీఎంగా యడియూరప్ప మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయనే పాలన నడిపిస్తున్నారు.. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంత్రివర్గ జాబితాను యడియూరప్ప ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ హైకమాండ్ నుంచి మాత్రం అనుమతి లభించలేదు. దీంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందంటూ ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలంటూ ఏకంగా గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశాయి.

అయితే, ఢిల్లీ పెద్దలంతా జమ్మ-కశ్మీర్‌ ఇష్యూతో బిజీగా ఉండటం వల్ల కేబినెట్ విస్తరణను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణగడంతో ఎట్టకేలకు యడియూరప్పకు హైకమాండ్‌ నుంచి పిలుపువచ్చింది. దీంతో యడియూరప్ప ప్రధాని నరేంద్రమోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా, వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసి జాబితాను అందించనున్నారు. ఇక ఈనెల 19న మంత్రివర్గ ఏర్పాటు ఉండే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం కూడా దాదాపు ఖరారు కావడంతో ఆశావహులు లాబీయింగ్‌ ముమ్మరం చేశారు. తొలిదశలో 10-12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు చేయనున్నట్టు సమాచారం. అటు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పరోక్షంగా సహకరించిన 17మంది అనర్హత ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో వీరికి ఇప్పట్లో ఛాన్స్ లేనట్లే.

కేబినెట్‌ బెర్తులకోసం దాదాపు 50 మంది పోటీ పడుతున్నారు. అందుకే హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. పదవులు దక్కిని వారెవరైనా రెబల్స్‌గా మారితే అసలుకే మోసం వస్తుంది. అందుకే కేబినెట్‌ విస్తరణ కోసం చాలా టైమ్ తీసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హైకమాండ్ తరపున ప్రముఖ నేతలు ఎవరూ హాజరు కాలేదు. అయితే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరిద్దరు పెద్దలను పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Watch :

Tags

Next Story