కృష్ణాకు వరదలు వస్తే జగన్ అమెరికా పర్యటనకు వెళ్లారు : చంద్రబాబు
కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద బాధితులకు టీడీపీ అండగా నిలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టిడిపి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జులు, ఇతర నేతలు పాల్గొనాలన్నారు. పసుపు, కంద, నిమ్మ, అరటి, కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలన్నారు చంద్రబాబు.
వరద నిర్వహణలో వైసీపీ నేతలు విఫలమయ్యారని విమర్శించారు. వరద తీవ్రత అంచనా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు చంద్రబాబు. ఎక్కడెక్కడ వరద వచ్చింది ఎంత వస్తే ఏం చేయాలనేదానిపై స్పష్టమైన నిర్దేశం లేదన్నారు. వరద నియంత్రణ వదిలేసి తన నివాసం చుట్టూ తిరిగారన్నారు చంద్రబాబు. తనను తన నివాసాన్ని టార్గెట్ చేయడమే వైసీపీ లక్ష్యమన్నారు చంద్రబాబు. తనపై కక్షసాధింపులతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారన్నారు చంద్రబాబు. వరద నిర్వహణలో తొలిరోజు నుంచి వైఫల్యం చెందారని.. దీన్ని మనిషి చేసిన విపత్తుగానే చూడాలన్నారు. దీనికి వైసీపీదే బాధ్యతన్నారు చంద్రబాబు. కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్ అమెరికా వెళ్లారని ఎద్దేవా చేశారు. అప్పుడు గోదావరి వరదల్లోనూ జగన్ జెరూసలెం పర్యటన వెళ్లారని గుర్తు చేశారు బాబు. పరిపాలనపై వీరికి సీరియస్నెస్ లేదన్నారు టీడీపీ అధినేత. ప్రభుత్వ టెర్రరిజంతో ఏపీనీ నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని జపాన్, ఫ్రాన్స్ హెచ్చరించాయన్నారు. ప్రపంచ దేశాలు అనేకం ఏపీకి దూరమయ్యాయని బాబు అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com