మహోగ్రరూపం దాల్చి శాంతించిన తుంగభధ్ర, కృష్ణమ్మ
నిన్నటి వరకు మహోగ్రరూపం దాల్చిన తుంగభధ్ర, కృష్ణమ్మలు క్రమంగా శాంతిస్తున్నాయి. భారీగా వచ్చిన వరదనీటితో ఇప్పటికే ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. జూలై ఆఖరి నుంచి కురుస్తున్న వర్షాలకు.. హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాం గరిష్ట స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉంది. డ్యాంలోకి 80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో.. అధికారులు 20 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో ఇన్ఫ్లో తగ్గిపోవడంతో.. తుంగభద్రనదిలో ఉద్ధృతి కూడా తగ్గిపోయింది
మరోవైపు కృష్ణమ్మ సైతం క్రమంగా శాంతిస్తోంది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో గత నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహించింది. నారాయణపూర్, ఆల్మట్టి నిండిపోయింది. అటు జూరాల నుంచి , ఇటు తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో .. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తేశారు. 885 అడగుల గరిష్ట నీటి మట్టానికి గాను... ప్రస్తుతం 882 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 215 టీఎంసీలకు గానీ.. 199 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి 4లక్షల 21 వేల 869 క్యూసెక్కులు వస్తుండగా... అవుట్ ఫ్లో 5 లక్షల 67 వేల 168 క్యూసెక్కులుగా ఉంది..
మరోవైపు.. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదుల చేస్తుండటంతో.... గుంటూరు జిల్లాలో లంక గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికీ 22 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీలో వరదనీరు దిగువకు విడుదల చేయడంతో...లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణానది వరద కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్లోని ఇళ్లను ముంచెత్తింది. వరద నీరు ఇంటిపైకప్పు వరకు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చారు. మొత్తానికి కృష్ణమ్మ క్రమంగా శాంతించినా.. వరద బాధితులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా.. తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని కోరుతున్నారు వరద బాధితులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com