ప్చ్.. రూ.12 లక్షలు గోవింద.. మాయ'లేడి' వలలో పడి..
మహానగరంలో మాయగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్ల రూపంలో మనమధ్యలోనే ఉన్నారు. సదా జాగ్రత్త అంటూ సైబర్ క్రైం పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మోసపోతూనే ఉన్నారు కొందరు అమాయక చక్రవర్తులు. హైదరాబాద్ రామంతాపూర్కి చెందిన ఓ యువకుడికి ఫేస్బుక్లో సాండ్రా ఐడా ఆడర్సన్ అనే యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్యా చాటింగులు.. ఫోన్లో టాకింగ్లు.. డీప్ లవ్లో పడిపోయాననుకున్నాడు. ప్రతిదీ నమ్మే స్టేజ్కి వచ్చేశాడు.
అదే సమయంలో ఫ్రెండ్షిప్ డే వచ్చింది. ఇదే అదనుగా భావించిన సదరు యువతి నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయిన నీకు ఓ మంచి గిప్ట్ పంపిస్తున్నాను. నీకోసం స్పెషల్గా కొన్నాను. కొరియర్ ఖర్చులు కొంత చెల్లిస్తే చాలని చల్లగా చెప్పింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ చార్జీలు చెల్లించడానికి డబ్బు పంపించమని కోరింది. అసలే డీప్ లవ్ అని భ్రమపడుతున్న అతడికి మోసపుతున్నానన్న విషయం మచ్చుకైనా అనిపించలేదు. అంత బాగా సోపేసేసరికి ఎంచక్కా నమ్మేశాడు. అలా ఆ పేరుతో, ఈపేరుతో కలిపి మొత్తం రూ.12 లక్షలు అతడి దగ్గరనుంచి రాబట్టింది. ఆ తర్వాత నుంచి టాటా బైబై. ఫోన్ స్విచ్ఛాప్. అడ్రస్ లేదు. ఎవరితోనైనా చెబితే తన పరువే పోతుందని.. పరిగెత్తుకెళ్లి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com