పేదలమీద పడ్డ వైసీపీ నేతలు.. గుడిసెలు కూల్చి..

ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు పేదలమీద పడ్డారు. గుడిసెలను కూల్చి ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేశారు. పోలీసుల సహాయంతో అడ్డొచ్చినవాళ్లను లాగిపడేశారు.
పేదలను అన్యాయంగా రోడ్డుపాలు చేసిన ఈ ఘటన కడప నగరంలో జరిగింది. ఆర్ట్స్ కాలేజి ఎదుట ఉన్న NTR నగర్లోని సర్వే నంబర్ 910లో రోజువారి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తాత్కాలిక గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు వీరిపై స్థానిక వైసీపీ నేతలు ప్రతాపం చూపించారు.
8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమి ఇది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని ఈ నిరుపేదలు ప్రభుత్వానికి చాలా సార్లు మొరపెట్టుకున్నారు. ఈ భూమిపై తనకే హక్కులున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కోర్టుకెక్కాడు. ఈ వ్యవహారం నడుస్తుండగానే భూమి తమదేనంటూ వైసీపీ నేతలు పేదలపై విరుచుకుపడ్డారు. పేదల్ని గుడిసెల్లోంచి బయటికి ఈడ్చేశారు.
కలెక్టరేట్ పక్కనే ఉన్న ఈ భూమిపై అధికార పార్టీ పెద్దల కన్నుపడింది. మరుక్షణమే ఇలా గద్దాల్లా వాలిపోయి రణరంగం సృష్టించి పేదలపై ప్రతాపం చూపించారు. పిల్లలు, ఆడవాళ్లు, ముసలోళ్లు అనే కనీస కనికరం లేకుండా జులుం ప్రదర్శించారు. ఈ తతంగాన్ని స్థానిక పోలీసులు దగ్గరుండి మరీ పూర్తి చేశారు. వైసీపీ నేతల దౌర్జన్యంపై పేదలు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com