ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనాథని హతమార్చాడు
కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లిలో ఈ దారుణం వెలుగు చూసింది. మాజీ సర్పంచ్ భాస్కర్రెడ్డి ఒక పథకం ప్రకారం బీమా కంపెనీకి టోకరా వేశాడు.. తన దగ్గర పాలేరుగా పనిచేస్తోన్న సుబ్బారాయుడు అనాథని గర్తించిన భాస్కర్రెడ్డి అతన్ని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకోవాలన్నది అతడి ప్లాన్. ఈ విషయాన్ని మిత్రులకు చెప్పాడు. సహకరించినవారికి వాట ఇస్తానని నమ్మించాడు. అలా...అతని పేరు మీద 56 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు భాస్కర్రెడ్డి. చివరికి.. సుబ్బారాయుడిని ఊరిబయటికి తీసుకెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపై పడుకోబెట్టి.... ట్రాక్టర్ ఎక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు..
ఆ తర్వాత .. రాజకీయ పలుకుబడితో.. ఓ నకిలీ ఓటరు కార్డు సృష్టించాడు. వడ్డే భాస్కర్గా నామినీ పెట్టి తన ఓటర్ కార్డులో పేరుని వడ్డే భాస్కర్గా మార్చేశాడు. అనంతరం చాకచక్యంగా ఇన్సూరెన్స్ కట్టాడు. ఆ తర్వాత సుబ్బారాయుడిని హత్య చేసి యాక్సిడెంట్లో చనిపోయినట్లు రికార్డులు సృష్టించాడు. ప్రమాదంలో చనిపోయాడంటూ సుబ్బారాయుడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. రూ. 32 లక్షల రూపాయలకు పైగా కాజేశాడు మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి.
మరికొంత డబ్బు కోసం ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఒత్తిడి తెస్తుండగా అనుమానించిన కంపెనీ ప్రతినిధులు...పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలో దిగడంతో.... కుట్రలు వెలుగు చూశాయి. 2015లో జరిగిన ఈ కుట్ర.. నాలుగేళ్ల తర్వాత బయటపడింది. దీంతో ఈ కేసులో.. నలుగురుని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ ఓటర్ ఐడీ కార్డు, హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్, రెండూ బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com