ఆ రెండు రోజులు కలిసొచ్చే అవకాశం

ఆ రెండు రోజులు కలిసొచ్చే అవకాశం

వచ్చే నెలలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నుంచి మొదలుకుని నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తి స్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని చెప్పారు. అసెంబ్లీని సమావేశపరచడానికి ముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా చర్చించాలని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు

సెప్టెంబర్‌లో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై కూడా ఈ సమీక్షలో చర్చ జరిగింది. వచ్చే నెల 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్లు, సీఎస్‌ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సీఎస్‌ పాల్గొనాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని తేదీలను ఖరారు చేయాల్సి ఉన్నందున.. సెప్టెంబర్ 4, 9, 14 తేదీలలో సమావేశాలు ప్రారంభించుకోవచ్చని అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ మూడు తేదీల్లో ఒక తేదీని ప్రభుత్వం ఖరారు చేయనుంది.

ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ ప్రసంగం చేసినందున బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదు. కాబట్టి రెండు రోజులు కలిసి వస్తాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో చర్చ, తర్వాత పద్దులపై చర్చ, అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలుంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయం త్వరలోనే నిర్ణయించనున్నారు.

Tags

Next Story