భారత జవాన్లపై కాల్పులకు దిగిన పాక్..
ఆర్టికల్ 370 రద్దుతో ఊగిపోతున్న పాక్... ఎలాగైనా భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయంగా ఒంటరైన పాక్.. ఇప్పుడు మన ఆర్మీని టార్గెట్ చేస్తూ దాడులకు కుట్ర చేస్తోంది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆర్మీ.. ఇప్పటికే వందకు పైగా స్పెషల్ సర్వీస్ టీం కమాండోలను మోహరించినట్లు గుర్తించింది మన సైన్యం. ఎస్ఎస్జీ కమాండోల చర్యల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, వీరంతా జైషే, ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్నారని వెల్లడించింది ఇండియన్ ఆర్మీ.
మరోవైపు.. ఇప్పటికే జమ్మూకశ్మీర్లోని లీపా వ్యాలీలో 12 మంది ఆఫ్ఘన్ జిహాదీలను జైషే సంస్థ దింపినట్లు గుర్తించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. భారత్ లక్ష్యాలపై దెబ్బకొట్టేందుకు ఈ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. జేఈఎం అధినేత మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ అజర్ ఆగస్టు 19, 20 తేదీల్లో బహవల్పూర్లో టెర్రరిస్టులతో సమావేశమయ్యారు. ఈ టెర్రరిస్టులు ప్రస్తుతం.. భారత్లోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు సరిహద్దుల్లో సిద్ధమైనట్లు గుర్తించింది ఐబీ.
ఓ వైపు టెర్రరిస్టుల్ని పంపిస్తున్న పాక్ ఆర్మీ.. మరోవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇవాళ ఉదయం భారత జవాన్లపై... కాల్పులకు దిగింది దాయాదిదేశం. అయితే పాక్ ఆర్మీ కాల్పుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ.
మరోవైపు.. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టుల కుట్రలతో అప్రమత్తమైన కేంద్రం... ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. రోడ్డుపై వాహనానాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com