వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం

అమెరికా యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్-64 భారత వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. అమెరికాకు చెందిన బోయింగ్ విమాన సంస్థ ఇవాళ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్కు అందించింది. పంజాబ్లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్లో ఈ అత్యాధునిక వార్ హెలీకాప్టర్లకు పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా. వీటి చేరికతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతం కానుంది.
అత్యాధునిక యుద్ధ హెలికాప్టరైన అపాచీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పని చేస్తాయి. గగన తలమే కాదు.. నేలపై కూడా టార్గెట్లను చేధించగలవు. ఇప్పటికే ఈ హెలికాప్టర్కు సంబంధించి అన్ని రకాల ముందస్తు పరీక్షలు పూర్తి చేసినట్లుగా భారత వాయుసేన అధికారులు ప్రకటించారు. అపాచీ ఏహెచ్-64 తొలిసారిగా ఎఎఫ్ఎస్ హిండన్ ఎయిర్ బేస్లో గాల్లోకి విజయవంతంగా ఎగిరాయి. మొత్తం 8 హెలికాప్టర్లు భారత వాయుసేనకు అందాయి.
2015 సెప్టెంబర్లో 22 అపాచీ హెలికాఫ్టర్ల కోసం అమెరికా సంస్థతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్ట్పై సంతకం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ 8 హెలీకాప్టర్లు భారత్కు అందగా.. మిగిలిన 14 చాపర్లు 2020 నాటికి భారత్కు చేరనున్నాయి. అపాచీ హెలికాప్టర్ల నిర్వహణ కోసం ఇప్పటికే మన వైమానిక దళ సభ్యులు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అలబామాలోని ఫోర్ట్ రూకర్ ఆర్మీ బేస్లో ఈ శిక్షణ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com