అందినట్టే అంది మిస్‌ అయిన చందమామ

అందినట్టే అంది మిస్‌ అయిన చందమామ

జాబిల్లి..అందినట్టే అంది జస్ట్‌ మిస్‌ అయ్యింది. సక్సెస్‌ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో సిగ్నల్‌ నిలిచిపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ - 2 చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఊపిరి సలపకుండా ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరి కొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ అందకుండా పోయాయి.

చివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. దీంతో శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇస్రో ఛైర్మన్ శివన్ సహా ఏ ఒక్కరు కూడా తమ సీట్లల్లో కూర్చోలేకపోయారు. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో అయిదు సెకెన్ల తరువాత మళ్లీ విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. అదే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి వచ్చిన చివరి సంకేంతం..

సుమారు 40 నిమిషాలు పాటు శాస్త్రవేత్తలు సిగ్నల్స్‌ కోసం ఎదురు చూశారు. అయినప్పటికీ.. ల్యాండర్ నుంచి ఎలాంటి సమాచారం గానీ.. అంకెలు గానీ గ్రౌండ్ స్టేషన్‌కు రాలేదు. చంద్రుడిపైకి మరికొన్ని క్షణాల్లో చేరే సమయంలో ల్యాండర్ నుంచి రావాల్సిన సంకేతాలు నిలిచిపోయాయని ప్రకటించారు. 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగినప్పటికీ చివరి నిమిషంలో సంబంధాలు తెగిపోయాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story