తెలంగాణ తొలి మహిళా గవర్నర్ తమిళిసై ప్రొఫైల్..

తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు తమిళిసై సౌందరరాజన్. కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్లో 1961 జూన్ 2న ఆమె జన్మించారు. తల్లి కృష్ణ కుమారి, తండ్రి అనంతన్. తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేతగానూ ఎంపీగానూ సేవలందించారు అనంతన్. తమిళిసై మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్గా కూడా ఉండేవారు. తమిళిసై భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే.
రాజకీయ కుటుంబం కావడంతో.. తమిళిసైకి కూడా చిన్నప్పటి నుంచే పాలిటిక్స్ అంటే ఆసక్తి ఏర్పడింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడే స్టూడెంట్స్ లీడర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. బీజేపీకి పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ విభాగంలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. 2010లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014 ఆగస్టు 16న తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం మాత్రం తమిళిసైకి రాలేదు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం 2009, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు తమిళిసై. పార్టీకి ఆమె చేసిన ఎనలేని సేవలను గుర్తించిన బీజేపీ హైకమాండ్.. తెలంగాణ గవర్నర్గా నియమించి గౌరవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

