అడవి నుంచి ఆకాశానికి ఎదిగిన గిరిజన బిడ్డ
అడవి నుంచి ఆకాశానికి ఎదిగిన అనుప్రియ లక్రా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గిరిజన గూడేల్లో పుట్టిన.. అడవి బిడ్డ ఇప్పుడు ఆకాశాన్ని అందుకుంటోంది. చదువుకోవడానికి కనీస సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. ఏకంగాపైలెట్ గా ఎదిగి ప్రశంసలు పొందుతోంది. ఒడిశాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మల్కాన్గిరి గిరిజన ప్రాంతంలో పుట్టిన 23 ఏళ్ల అనుప్రియ లక్రా.. ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
గిరిజన పుత్రిక అయిన అను ప్రియ తొలి గిరిజన మహిళా పైలెట్ గా అద్భుత అవకాశం దక్కించుకుంది. కమర్షియల్ విమానాన్ని నడిపే ఆదివాసీ మహిళా పైలెట్ గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. పైలెట్గా ఎంపికైన తొలి గిరిజన యువతి అనుప్రియానే.
చిన్నతనం నుంచి ఫైలెట్ కావాలని కలలు కన్న అనుప్రియ.. 2012లో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి ఫైలెట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్లోని ఫైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో చేరింది. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో- ఫైలెట్గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది.
అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా.. ఒడిశా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆయన తన బిడ్డను ఎంతో కష్టపడి చదివించారు. ఆ గిరిజన గ్రామంలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా.. మరోవైపు మావోయిస్టుల భయం ఉన్నా.. పట్టుదల నిబద్దతతో.. తల్లిదండ్రుల కలలను నెరవేర్చింది. ఆదివాసీ మహిళ.. పైలెట్ గా ఘనతను సాధించి ఎందరో మహిళలకు ఆదర్శమైంది.
అనుప్రియ లక్రాపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనుప్రియకు అభినందనలు తెలిపారు. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారని కొనియాడారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారంటూ నవీన్ పట్నాయక్ ప్రశంసించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com