యాదాద్రి ఆలయంలో రాజకీయ చిత్రాల తొలగింపు.. ఆ స్థానంలో..

యాదాద్రి ఆలయంలో రాజకీయ చిత్రాల తొలగింపు.. ఆ స్థానంలో..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో.... రాజకీయ చిత్రాలు చెక్కడం తీవ్ర దుమారం రేపింది. దేవాలయంలో వ్యక్తులు, పార్టీ గుర్తులు పెట్టడమేంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి. యాదాద్రిలో ఆందోళనకు దిగాయి విపక్షాలు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ భారీ ఆందోళనలు చేశాయి. రాజకీయ పార్టీల నిరసనలు, ఆందోళనలతో ఈ ప్రాంతమంతా హోరెత్తింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మొహరించారు.

బీజేపీ నేతలు ఈ వివాదంపై సీరియస్‌గా ఉన్నారు. ప్రభుత్వ చర్యపై తీవ్రంగా మండిపడిన ఆ పార్టీ నేతలు... వారం రోజుల డెడ్‌లైన్‌ పెట్టారు. ఈలోగా బొమ్మలు తీయకపోతే... భారీ ఆందోళనకు దిగతామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే దీనిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ బొమ్మలున్న స్థంభాలను నీళ్లతో కడిగి ప్రక్షాళన చేశారు. హస్తం నేతలు ధర్నాలకు దిగడంతో గత రెండ్రోజులుగా యాదాద్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వ్యవహారం చేయిదాటుతుండటంతో ప్రభుత్వం అలర్ట్‌ అయింది. నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. వివాదాలకు కారణమైన కేసీఆర్‌ బొమ్మ సహా అన్ని బొమ్మలు తొలగిస్తామని ప్రకటించారు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు .తాము ఎవరికీ నేతలు, పార్టీల బొమ్మలు చెక్కమని చెప్పలేదని, ఒకరిద్దరూ శిల్పులే తమ ఇష్టానుసారం ఈ శిల్పాలను చెక్కారంటూ వివరించారు. సీఎం కేసీఆర్‌ సైతం.. ఆలయంలో తన బొమ్మ ఉండాలని ఎప్పూడూ కోరుకోలేదన్నారు

రాష్ట్రవ్యాప్తంగా... యాదాద్రిలో రాజకీయ బొమ్మలపై తీవ్ర విమర్శలు రావడంతో.... ప్రభుత్వ ఆదేశాలు కూడా వెంటనే అమల్లోకి వచ్చాయి. భారీ పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. వాటి స్థానంలో కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు.

Tags

Next Story