చైర్మన్‌‌గా పనిచేసిన హాస్పిటల్‌లోనే కోడెల మృతి

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌తో కోడెలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆస్పత్రి నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణను ముందుండి చూసుకున్నారు. ఆ ట్రస్టుకు ఆయన తొలి చైర్మన్‌గా పనిచేశారు. ఎందరో రోగులకు వైద్య సేవలు అందించడంలో కోడెల సేవలు మరువలేనివిగా చెప్తున్నారు. రాజకీయాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా.. తనకు ఇష్టమైన వైద్య వృత్తి పట్ల కూడా అంతే నిబద్ధత కనబరిచేవారు కోడెల.

పల్నాడులో పేదల డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోడెలను.. రాజకీయాల్లోకి ఆహ్వానించారు ఎన్టీఆర్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నప్పడు.. ఆ బాధ్యతలను కూడా కోడెలకే అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆస్పత్రి నిర్మాణం జరిగింది. నిర్వహణ బాధ్యతల్లోను కొన్నేళ్లు క్రియాశీలకంగా వ్యవహరించారు. కానీ.. కోడెల మరణవార్త అదే హాస్పిటల్ ద్వారా ప్రపంచానికి తెలియడం అందరి మనసులు కలచివేస్తోంది. కోడెల మృతి చెందడాన్ని.. ఆయన సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రాజకీయ నేతగా దూకుడుగా ఉన్నా.. వైద్యుడిగా కోడెల సున్నితమని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. ఎప్పుడు ఫోన్‌ చేసినా క్లినిక్‌లోనే ఉంటానని కోడెల అనేవారని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఖద్దరు తప్పనిసరై వేసుకుంటున్నానని.. తెల్లకోటు అంటే ఇష్టమని నవ్వుతూ చెప్పడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Also watch :

Tags

Next Story