మెడికల్ మాఫియా.. ఈఎస్ఐ స్కామ్లో తవ్వేకొద్దీ..

ఈఎస్ఐ కుంభకోణం తీగ లాగేకొద్ది డొంక కదులుతూనే ఉంది. ముమ్మర విచారణలో కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. 46 కోట్ల రూపాయల దోపీడీకి పథకం వేసినట్టు వెలుగులోకి వచ్చింది. బడ్జెట్ విడుదల అయ్యి ఉంటే ఈపాటికే భారీ సొమ్ము కొల్గగొట్టేయాలని వ్యూహం సిద్ధమం చేసినట్టు విచారణలో ఏసీబీ అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఓమ్నిమెడి సంస్థ ప్రతినిధి సీహెచ్ శివనాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీల్లో 46 కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోలుకు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పర్చేజింగ్ ఆర్డర్లు దొరికాయి. ఈఎస్ఐతో రేటు కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్న వాటిలో 42 ఫార్మా కంపెనీలకు ఓమ్నిమెడియే పంపిణీదారు. ఇంత పెద్దమొత్తంలో కొనుగోలు ఉత్తర్వులను ముందుగానే ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? ఆ పత్రాలు ప్రైవేటు కంపెనీ వ్యక్తి ఇంట్లో ఎందుకు ఉన్నాయి? అనే అంశాలపై ఏసీబీ విచారణ జరుపుతోంది.
ఈ కుంభకోణంలో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ తర్వాత శివనాగరాజే కీలక నిందితుడు. డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్కు మధ్యవర్తిగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను శివనాగరాజు స్వీకరించాడు. అతన్ని విచారిస్తే ఇండెంట్లు, పర్చేజ్ ఆర్డర్ల సమాధానం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశంపై డైరెక్టర్, జేడీలను కూడా కస్టడీలో ప్రశ్నించనున్నారు. ఏసీబీ ప్రాథమిక విచారణలో 11 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు తేలినా.. మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

