బోటు ప్రమాదం.. ఒడ్డుకు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి నదిలో మరో నాలుగు మృతదేహాలు కనిపించాయి.. గుర్తుతెలియని మృతదేహాలు నది ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.. గుర్తించలేనంతా శరీరాలు మారిపోయాయి. ఈ మృతదేహాలు కచ్చులూరు వద్ద పర్యాటక బోటు ప్రమాదంలో చనిపోయిన వారివే అయి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల్లో ఒకటి మహిళది కాగా.. మిగిలిన మూడు పురుషులవి.. గుర్తించడానికి వీల్లేకుండా ఉన్న డెడ్బాడీలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బోటు ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువులు ఆస్పత్రికి వచ్చి డెడ్బాడీలు తమవారివో కావో గుర్తించాలని కోరారు.
అటు కచ్చులూరు బోటు ప్రమాదం జరిగి 20 రోజులు దాటింది. నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ధర్మాడి సత్యం టీమ్ కూడా బోటును బయటకు తీయలేకపోయింది. ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద భారీగా వస్తుండటంతో బోటు వెలికితీత పనులను నిలిపివేశారు. బోటు కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లేని తమ వారి కోసం గోదావరి ఒడ్డునే బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా మరో నాలుగు మృతదేహాలు లభించడంతో వాటిని గుర్తించేందుకు రాజమహేంద్రవరం ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com