నెల పది రోజులు ఆలస్యంగా రుతు పవనాల నిష్క్రమణ..
వరుస వర్షాలతో గడగడలాడిస్తున్న వరుణ దేవుడు.. మరో రోజులు వరకు శాంతించే సూచనలు కనబడటం లేదు. భారత ఉపఖండం నుంచి సాధారణంగా రుతు పవనాలు సెప్టెంబర్ ఒకటి నుంచి వెనక్కి పోతాయి. ఈసారి నెల పది రోజులు ఆలస్యంగా అంటే అక్టోబర్ పది నుంచి వెనక్కి మళ్లే ఛాన్స్ ఉందని భారత వాతావరణ పరిశోధన శాఖ అంచనా వేస్తోంది. ఈసారి సాధారణ వర్షపాతాలే ఉంటాయని గత ఏప్రిల్ నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి రుతు పవనాల సీజన్ పూర్తి అనూహ్యంగా కొనసాగింది. మొట్టమొదట కేరళలోకి వారం ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. మూడు వారాల అనంతరం ముంబైకి చేరుకున్నాయి.
రుతుపవనాల ఆలస్యం వల్ల జూన్ నెలలో 33 శాతం లోటు వర్షపాతం నమోదయింది. సీజన్ ముగిసే సమయానికి సాధారణ వర్షపాతం కన్నా పది శాతం ఎక్కువ కురిసింది. కొద్ది కాలంలోనే భారీ వర్షాలు కురవడం మరో విశేషం. దీని వల్లనే అధిక వర్షపాతం నమోదయింది. ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. కర్ణాటక వరదల్లో 80 మంది మరణించారు. సెప్టెంబర్ లో బీహార్లో సంభవించిన వరదలకు 80మందికి పైగా మృత్యువాత పడ్డారు. 1951 నుంచి 2000 వరకు 50 సంవత్సరాల్లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు సగటున 88 శాతం వర్షపాతం నమోదయింది. ఈ ఒక్క ఏడాదే రుతుపవనాల కాలంలో 97 శాతం వర్షపాతం కురిసింది. సీజన్ పూర్తి కాలానికి అంటే అక్టోబర్ మొదటి వారానికి సరాసరి తీసుకున్నట్లయితే 110 శాతం వర్షపాతం నమోదయింది.
సీజన్లో మొదటి మూడు వారాలపాటు అతి తక్కువ వర్షపాతం కురిసి, ఆ తర్వాత వెనువెంటనే భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈసారి వర్షపాతం ఇలా కొనసాగడం అన్నది ఓ ప్రత్యేకమైందని, వచ్చే ఏడాది ఇది పునరావృతం అవుతుందని భావించడం తప్పని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈసారి మధ్య, దక్షిణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిసింది. ఈ రెండు ప్రాంతాల్లో గతేడాది తక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటికీ ఈశాన్య ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతమే కురిసింది. ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడం వాస్తవమే అయినా అధిక వర్షపాతం వల్ల దేశంలోని పలు రిజర్వాయర్లు నిండడం, భూగర్భ జలాలు పెరగడం హర్షించతగ్గ పరిణామం. అల్ప పీడనాల వల్లనే ఈసారి అధిక వర్షం కురిశాయంటున్నారు శాస్త్రవేత్తలు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com