రాజధాని అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణ కొత్త కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. నిపుణుల కమిటీ నియమించామని తెలిపారు. దాదాపు రెండు నెలల క్రితం ఆగస్టు చివరి వారంలో... ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు
అప్పట్లో కలకలం సృష్టించాయి. రాజధాని అమరావతిపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ... బొత్స చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమరావతి ప్రాంతం రాజధానిగా సురక్షితం కాదని శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిందని, రాజధానిపై మళ్లీ చర్చించాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.
మళ్లీ రెండు నెలల గ్యాప్ తర్వాత ఏపీ రాజధాని అంశంపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ ప్రాంతాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిపుణుల కమిటీని నియమించామని బొత్స తెలిపారు. కమిటీ సూచనలు సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించి, ప్రజాభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు మంత్రి బొత్స.
అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద 33 వేల ఎకరాల భూములను గత టీడీపీ ప్రభుత్వం సమీకరించింది. సింగపూర్ సహాయంతో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం ప్రయత్నించింది. కొన్ని భవనాల నిర్మాణ పనులు ప్రారంభించింది. రాజధానిలో తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు రాజధాని నిర్మాణ పనుల సందడి కనిపించింది. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గత కొన్ని నెలలుగా రాజధాని నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు మంత్రి బొత్స ప్రకటనతో ఏపీ రాజధాని అంశం మళ్లీ చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com