బెడిసికొట్టిన డ్రాగన్ ప్లాన్.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం
హాంకాంగ్పై ఇప్పటికే పెత్తనం చేస్తున్న చైనా, తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఎత్తుగడ వేసింది. అందులో భాగంగా నేరస్తుల అప్పగింత బిల్లును హాంకాంగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు తెరపైకి వచ్చిన వెంటనే హాంకాంగర్లు తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమబాట పట్టారు. జూన్లో మొదలైన నిరసనల పర్వం నెలల పాటు కొనసాగింది. లాఠీఛార్జ్ చేసినా, భాష్పవాయుగోళాలు ప్రయోగించినా, కాల్పులు జరిపినా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. పైగా రెట్టించిన పట్టుదలతో ఉద్యమం చేశారు.
ప్రజా ఉద్యమంతో హాంకాంగ్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఐతే, కంటి తుడుపు ప్రకటన సరిపోదని, బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రజలు తెగేసి చెప్పారు. ఇదే డిమాండ్తో పార్లమెంట్ను, ఎయిర్పోర్టును ముట్టడించారు. ఆ క్రమంలో హాంకాంగర్ల పోరాటం స్వతంత్ర పోరాటంగా మారింది. చైనా పెత్తనం నుంచి తమకు విముక్తి కల్పించాలని హాంకాంగ్ ప్రజలు డిమాండ్ చేశారు. డ్రాగన్ కుట్రలకు తమను బలి చేయవద్దని నినదించారు.
2018లో హాంకాంగ్కు చెందిన చాన్ టాంగ్ కాయి అనే వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేశాడు. ఆ కేసులో చాన్ టాంగ్ను అప్పగించాలని చైనా నియంత్రణలో ఉన్న తైవాన్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నేరస్థుల అప్పగింత బిల్లు రూపొందింది. చైనా కుట్రలను పసిగట్టిన హాంకాంగ్ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, చాన్ టాంగ్ కాయిని విడుదల చేసింది. ప్రస్తుతం అతన్ని హాంకాంగ్లోనే ఉంచారు.
ఇదిలా ఉంటే, నేరస్థుల అప్పగింత బిల్లును వెనక్కి తీసుకోవడంపై చైనా ఉడికిపోతోంది. హాంకాంగ్ సీఈఓ కెర్రీ లామ్పై చైనా ప్రభుత్వం రుసరుసలాడుతోంది. తమ సూచనలకు అనుగుణంగా పని చేయడంలో కెర్రీ లామ్ విఫలమైందని అక్కసు వెళ్లగక్కింది. సీఈఓ పదవి నుంచి లామ్ను తప్పించాలని ప్లాన్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com