ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోన్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కొత్త రైలు

తిరుపతి- లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కొత్త రైలు.. ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన లింక్ ఆఫ్ మెన్ బుష్ బోగీలతో కుదుపు లేని ప్రయాణాన్నిప్రయాణికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటోంది. ఇంటి వాతావారాణాన్ని తలపించేలా ఉండే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్లో ప్రయాణం ఎంతో సుఖంగా వుంటోందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్ళ ద్వారా తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. యాత్రికుల అవసరాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ళను నడుపుతోంది. అయితే.. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలును ఇటీవల కొత్త హంగులతో తీర్చిదిద్దారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్య ఇటీవల సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించారు.
గతంలో నడిచిన నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న రైలుకు ఎంతో వ్యత్యాసం ఉంది. కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు బయో టాయిలెట్, మోడల్ కుళాయిలు, లింక్ ఆఫ్ మెన్ బోగీలతో కుదుపు,శబ్దాలు లేని ప్రయాణం, వేగంగా తిరిగే సీలింగ్ ఫ్యాన్లు, పై బెర్తులు ఎక్కేందుకు వీలుగా చైన్లింకులు వంటి ఎన్నో సౌకర్యాలు కొత్త నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో కనిపిస్తాయి. మెత్తని బెర్తులు.., బెర్తు బెర్తుకు ఛార్జింగ్ పాయింట్లు, విశాలమైన కిటికీలు, వాష్ బేషిన్లు, ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బోర్డులు, రాత్రి వేళ పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా చిన్నపాటి దీపాలు.. ఇలా. ఎన్నో. మెరుగైన అధునాతన సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. గతంలో ఉన్న 5 ఏసీ కోచ్లను ఏడుకు పెంచారు. హెడ్ ఆన్ జనరేట్ వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల రైలులో శబ్దకాలుష్యం, కర్బన ఉద్గారాల విడుదల తగ్గి రైల్వేకి ఇంధనం ఆదా అవుతోంది. సంవత్సరానికి 6కోట్ల రూపాయల మేర దక్షిణ మధ్య రైల్వేకు ఖర్చు తగ్గే అవకాశం ఉందంటున్నారు.. రైల్వే అధికారులు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు మెయింట్నెన్స్ వ్యయం తగ్గుతుండటంతో ఈ మోడల్ను అన్ని రైళ్లలో ప్రవేశపెట్టాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది.
మరో వైపు.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక బోగీ మీద మరో బోగీ ఎక్కే అవకాశం నారాయణాద్రిలో ఏ మాత్రం లేదంటున్నారు.. రైల్వే అధికారులు. వేగంగా ఒక బోగీని మరో బోగీ ఢీకొంటే అలాగే నిలిచేందుకు మధ్యలో అధునాతన టెక్నాలజీతో కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో.. ప్రమాదం జరిగినా క్షతగాత్రుల సంఖ్యను తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అధునాతన సౌకర్యాలతో నారాయణాద్రిని తీర్చిదిద్దిన రైల్వేశాఖకు ప్రయాణికులు ధ్యాంక్స్ చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

