పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం మరింత విషమం

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం మరింత విషమించింది. రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య భారీగా తగ్గింది. ప్లేట్ లెట్స్ పడిపోయిన సమయంలోనే గుండెలో రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు తలెత్తి ఛాతిలో నొప్పి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం షరీఫ్ను విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఐతే, ఇందుకు కోర్టు అనుమతి పొందాల్సి ఉంటుంది. గతంలో షరీఫ్కు గుండెపోటు వచ్చింది. నాటి నుంచి గుండె సంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడుతున్నారు. ఆ మందుల వాడకం వల్లే ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ మందుల వాడకాన్ని ఆపేశామని చెప్పారు.
పనామా పత్రాల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్ దోషిగా తేలారు. అవినీతి ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లారు. కోట్లఖ్పతి జైలుతో పాటు ఇతర జైళ్లల్లో ఉన్నారు. జైలులో ఉన్న సమయంలోనే ఆయనపై విష ప్రయోగం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలు వచ్చిన సమయంలోనే షరీఫ్ ఆరోగ్యం దెబ్బతింది. దాంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com