చిక్కుల్లో బాలీవుడ్ బ్యూటీ..
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి చిక్కుల్లో పడ్డారు. ఆమె భర్త రాజ్ కుంద్రా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. మనీలాండరింగ్ కేసులో రాజ్కుంద్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ముంబైలోని ఈడీ ఆఫీస్లో విచారణ జరిగింది. వాస్తవానికి నవంబర్ 4న విచారణ జరగాల్సి ఉండగా, వ్యక్తిగత పనుల కారణంగా రాజ్కుంద్రా ముందుగానే విచారణకు హాజరయ్యారు. గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చీ అనుచరుడు రంజిత్ బింద్రాతో సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. RKW డెవలపర్స్, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో రాజ్ కుంద్రాకు ఉన్న వ్యాపార లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది. గతంలోనూ ఈ కేసుపై దర్యాప్తు జరిగింది. ఐతే, తాను ఏ తప్పూ చేయలేదని అప్పట్లో రాజ్కుంద్రా వెల్లడించారు.
గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చీకి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలున్నాయి. దావూద్తో ఇక్బాల్ మిర్చీ 2013లో చనిపోయాడు. దావూద్తో సంబంధాలను అడ్డుపెట్టుకొని ఇక్బాల్ మిర్చీ రెచ్చి పోయాడు. మనీలాండరింగ్ చేసి ముంబైలో ఖరీదైన ఆస్తులు సంపాదించాడు. అతనికి రంజిత్ బింద్రా సహకరించాడని ఆరోపణలున్నాయి. ఇక, రంజిత్ బింద్రాకు రకరకాల బిజినెస్లలో పార్ట్నర్షిప్ ఉంది. RKW డెవలపర్స్లో డెరెక్టర్గా ఉన్నాడు. ఎసెన్షియల్ హాస్పిటాలిటీ సంస్థకు, RKW డెవలపర్స్ 3 కోట్ల 46 లక్షల రూపాయలు లోన్ ఇచ్చింది. ఈ కార్యకలాపాల వెనక మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఇక, RKW డెవలపర్స్లో రాజ్కుంద్రా, శిల్పాశెట్టి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో.. రంజిత్తో సంబంధాలపై రాజ్ కుంద్రాను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.
రాజ్కుంద్రాపై ఈడీ ఎప్పటి నుంచో నిఘా పెట్టింది. ఇటీవల రాజ్కుంద్రా, రంజిత్ బింద్రా మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. దాంతో ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు సేకరించడానికి రాజ్కుంద్రాను పిలిపించింది. బిట్ కాయిన్ స్కామ్లో కూడా రాజ్ కుంద్రా విచారణ ఎదుర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com