బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

mothkupalli-narasimhulu

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో మోత్కుపల్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పరిస్థితుల్ని అమిత్‌ షాకు ఆయన వివరించారు. అమిత్‌షాతో భేటీ తర్వాత బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలిశారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీకి దూరం అయిన తర్వాత మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరతాని ప్రచారం జరిగింది.. అందుకే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లుగా అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.. అయితే, ఈ ప్రచారానికి తెరదించుతూ ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రధాని మోదీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చే పార్టీలో చేరానన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. అమిత్‌షాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి.. తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనపై పోరాటం చేస్తామన్నారు. తనకు పదవులపై వ్యామోహం లేదన్న మోత్కుపల్లి.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో పార్టీనే నిర్ణయిస్తుందన్నారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి పేదల పక్షాన పోరాడిన నాయకుడన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. మోత్కుపల్లి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆర్టీసీ సమ్మెపై వివరాలను అమిత్‌షాకు వివరించినట్టు లక్ష్మణ్‌ చెప్పారు. ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేకుండా ఏపీఎస్‌ ఆర్టీసీని విభజన చేశారని లక్ష్మణ్‌ అన్నారు. పార్టీలో మంచి గౌరవం దక్కుతుందనే ముఖ్య నేతల హామీ మేరకే మోత్కుపల్లి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.. అయితే, ఆయనకు పార్టీ అధిష్టానం ఎలాంటి పదవి ఇస్తుందో చూడాలి.

Tags

Next Story