ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఇకపై వారానికి 4రోజులే ఆఫీస్..

పని ఉందంటూ లీవ్ పెట్టేపన్లేదు.. ఇప్పుడే వస్తానంటూ పని మధ్యలో పర్మిషన్ అడిగే అవసరం అసలే లేదు.. వారానికి 4 రోజులు ఆఫీస్కి రండి. మిగతా మూడు రోజులు మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లండి.. ఏమైనా చేస్కోండి అని అంటోంది జపాన్కు చెందిన మైక్రోసాప్ట్ కంపెనీ. జపాన్లో ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులు సమయమంతా ఆఫీసులోనే గడి పేస్తున్నారట. కుటుంబసభ్యులతో గడపడానికి టైమ్ ఉండట్లేదు. జీవితంలో ఓ సరదా.. సంతోషం ఏమీ లేకుండా పోతోంది. ఈ విషయాన్ని గుర్తించిన మైక్రోసాప్ట్ 2300 మంది ఉద్యోగులకు మూడు రోజులు వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఓనెల ట్రయిల్ రన్ నడిపి రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయాలనుకుంటోంది సంస్థ.
సాధారణంగా ఏ కంపెనీలో అయినా సెలవు కావాలని అడిగితే మరైతే ఈ రోజే రేపటి పని కూడా పూర్తి చేసి వెళ్లు అని చెబుతారు. కానీ ఇక్కడ అలా కాదు. ఉన్న సమయంలోనే క్వాలిటీ వర్క్ని అందించమంటోంది. టీ, కాఫీల పేరుతో గంటల తరబడి క్యాంటిన్లో కూర్చోవద్దు. చిన్న చిన్న పనులకు కూడా మీటింగ్ పేరుతో సమయాన్ని వృధా చేయొద్దు అని మాత్రం కండిషన్ పెట్టిందట. దాంతో చాలా సమయం అదా అవుతుంది. యాజమాన్యం ఇచ్చిన డెడ్లైన్కే వర్క్ని పూర్తిచేస్తున్నారు జపాన్ ఉద్యోగులు. మైక్రోసాప్ట్ చేపట్టిన ఈ ప్రయత్నం ఫలిస్తే దీన్నే కొనసాగించాలనుకుంటోంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మిగతా కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com