టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని నిండా ముంచిన ముఠా!

టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని నిండా ముంచిన ముఠా!
X

fraud

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగుల్ని నిండా ముంచింది ఓ ముఠా! తిరుమలలో ఇండియన్‌ బ్యాంక్‌లో లడ్డూకౌంటర్‌ను లీజ్‌కు తీసుకున్న మహేష్‌తో పాటు అతని స్నేహితులు శ్రీనివాస్‌రావు, కార్తీక్, నారాయణ, రాజశేఖర్‌లు... సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. టీటీడీలో ఉద్యోగాలున్నాయంటూ.. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలతో ప్రకటనలు చేశారు. తిరుమలలో సులభ్‌ కాంప్లెక్స్‌, అన్నదానం, లడ్డూకౌంటర్లలో ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. 30 మందికి పైగా నిరుద్యోగులు వీరిని ఆశ్రయించారు. దీంతో ఒక్కొక్కరి నుంచి 20 నుంచి 50 వేలకు వరకు డబ్బులు వసూలు చేశారు. వీరే గుర్తింపు కార్డులు ముద్రించి ఇచ్చారు. ఇలా 30 మందికి పైగా మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు.

అయితే గోపిసింగ్‌ అనే వ్యక్తికి అన్నదానంలో సూపర్‌వైజర్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఈ ముఠా... అతని వద్ద నుంచి 57 వేల రూపాయలు తీసుకుంది. కానీ సూపర్‌వైజర్‌ ఉద్యోగం ఇవ్వకుండా... డిష్‌ క్లీనింగ్‌ ఉద్యోగం ఇప్పించారు. ఎంబీఏ చదువుకున్న తనకు డిష్‌ క్లీనింగ్‌ ఉద్యోగం ఇప్పించడంతో.. తాను మోసపోయాయని తెలుసుకున్న గోపిసింగ్‌... తిరుపతి ఈస్ట్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు.

బాధితుడు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు... గోపిసింగ్‌తో పాటు మరికొంతమందిని ఈ ముఠా మోసం చేసిందని గుర్తించారు. ముఠాలోని నలుగురుసభ్యులు శ్రీనివాసరావు, నారాయణ, కార్తీక్‌, రాజశేఖర్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు మహేష్‌ పరారీలో ఉన్నారు. అతన్ని కూడా త్వరలోన అరెస్ట్‌ చేస్తామంటున్నారు పోలీసులు.

Tags

Next Story