ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టు విచారణ

ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టు విచారణ

tsrtc-hc

ఆర్టీసీ సమ్మె, సంస్థ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. సమ్మెను విరమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశాయి కార్మిక సంఘాలు. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేసేలా..రాజకీయ పార్టీలను కలిసి ప్రణాళికలు రూపొందిస్తోంది జేఏసీ. అటు ప్రభుత్వం తరపున హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు అధికారులు. గురువారం హైకోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో...అధికారులు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీకి ఉన్న బకాయిలు రూ.3వేల 6కోట్లయితే... ప్రభుత్వం ఇప్పటికే రూ.3 వేల 903 కోట్లు చెల్లించిందన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీయే తిరిగి సర్కారుకు రూ. 540కోట్లు చెల్లించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అటు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే రూ.867 కోట్లు ఎక్కువే వచ్చాయని ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. 2018-19 ఏడాదిలో GHMC ఆర్టీసీకి ఎలాంటి బకాయిలేదని వివరించారు కమిషనర్ లోకేశ్ కుమార్.

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్. సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకపోతే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని..త్వరలోనే పార్టీ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.ఆర్టీసీ జేఏసీ నేతలు లక్ష్మణ్‌ను కలిసి..భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

కార్మిక సంఘాలను సీఎం చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీలో కేంద్రం వాటా ఉన్నందున.. అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని.. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

Tags

Next Story