ఎక్స్ప్రెస్ రైల్ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ ట్రైన్

హైదరాబాద్ కాచిగూడలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్కు అతి సమీపంలో హంద్రీ ఎక్స్ప్రెస్ రైల్ను, ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. MMTS లోకోపైలెట్ శేఖర్ కేబిన్లోనే ఇరుక్కుపోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. MMTS రైలుతో పాటు హంద్రీ ఎక్స్ప్రెస్ కూడా ఒకే సమయంలో ట్రాక్పైకి రావడమే ఈ ప్రమాదానికి కారణమైంది. రెండు రైళ్ల ఇంజిన్లు బలంగా ఢీకొనడంతో.. MMTS ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. లోకోపైలెట్ను కేబిన్ నుంచి బయటకు తీసేందుకు ఐరన్ షీట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
MMTSకి మిగతా రైళ్లలాగ ప్రత్యేకంగా భారీ ఇంజిన్ ఉండదు. ప్రయాణికుల బోగీలోనే కొంత భాగాన్ని కేబిన్గా కేటాయిస్తారు. దీంతో.. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు MMTS ముందుభాగం బాగా దెబ్బతింది. కర్నూలు నుంచి వస్తున్న రైలు కాచిగూడ స్టేషన్లోకి ఎంటర్ అవుతుండగా.. అటువైపు నుంచి MMTS రైలు బయటకు వస్తోంది. ఈ రెండూ వేర్వేరు రూట్లలో వెళ్లేలా ట్రాక్ను మార్చాల్సి ఉన్నా అది జరగలేదు. ఈ సాంకేతిక వైఫల్యానికి కారణం ఏంటి.. ట్రాక్ మారకుండా ఎందుకు ఉండిపోయింది అనే దానిపై విచారణ చేస్తున్నామంటున్నారు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు.
లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు వెళ్తున్న MMTS రైలు 2వ ప్లాట్ ఫాం నుంచి బయలుదేరింది. అదే సమయంలో కాచిగూడ స్టేషన్లోని 4వ ప్లాట్ఫామ్కు వచ్చేందుకు హంద్రీ ఎక్స్ప్రెస్ లోపలికి ప్రవేశిస్తోంది. ఈ రెండూ ట్రాక్ మారాల్సిన సమయంలో ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన తర్వాత గాయపడ్డవాళ్లను తరలించేందుకు అంబులెన్స్లు రావడానికి గంటవరకూ సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న MMTS రైలు ఈ ప్రమాదంలో పట్టాలు తప్పింది. 3 కోచ్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఢీకొట్టిన ట్రైన్ చక్రాలు విరిగిపోయాయి. సేఫ్గార్డ్స్ కూడా వంగిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత MMTSలో ఉన్నవాళ్లు, రైల్వే పోలీసులు కలిసి గాయపడ్డవాళ్లను కాచిగూడ స్టేషన్కు తీసుకెళ్లారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com