ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం వై.చెర్లోపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న నలుగురు నాన్ టీచింగ్ వర్కర్లను అర్థంతరంగా విధుల నుంచి తొలగించారు అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడంతో ఆవేదనకు లోనయ్యారు. ప్రిన్సిపాల్ను ప్రశ్నించినా సరైన సమాధానం రాకపోవడంతో మనస్తాపానికి గురైన సిబ్బంది ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మల్లీశ్వరి, రాజేశ్వరి, విశ్రాంతమ్మ, శ్రీలక్ష్మి అనే నలుగురు మోడల్ స్కూల్లో ఔట్ సోర్సింగ్ కింద వంటపని చేస్తున్నారు. ఈ ఉద్యోగాలే వీరికి జీవనాధారం. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఉన్నట్టుండి నలుగురినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో వీరు షాక్కు గురయ్యారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండానే ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. ఆస్పత్రిలో వీరి పరిస్థితిని చూసి బంధువులు రోదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com