సిమెంట్ కంపెనీలతో కమీషన్ల కోసం బేరసారాలు : చంద్రబాబునాయుడు


ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు దీక్షచేస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్లో ఆయన 12 గంటల దీక్ష మొదలైంది. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు నివాళులు అర్పించి చంద్రబాబు దీక్షలో కూర్చుకున్నారు. ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూకి నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలకు కూడా అంజలి ఘటించారు. చంద్రబాబుతో పాటు పలువురు భవన నిర్మాణ కార్మికులు దీక్షలో కూర్చున్నారు. అటు, ఈ నిరసన దీక్షకు భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున తరలివచ్చిన వాళ్లతో ధర్నా చౌక్ కిక్కిరిసిపోయింది.
ఏపీలో ఇసుక కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు చంద్రబాబు. సిమెంట్ కంపెనీలతో కమీషన్ల కోసం బేరసారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఉన్నా.. కొందరు యధేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 లక్షల కుటుంబాలు పూట తిండి లేకుండా ఇబ్బంది పడడానికి YCP ప్రభుత్వమే కారణమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

