ఎస్వీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం.. 70వేలమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం


తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అధికారులు నిర్లక్ష్యం 70వేలమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. డిగ్రీ పరీక్షల నిర్వహణలో భారీగా తప్పులు దొర్లాయి. పరీక్షల ప్రారంభానికి సరిగ్గా రెండురోజుల ముందు గందరగోళం కలకలం నెలకొంది. ఎస్వీయు హాల్ టిక్కెట్లు జారీ చేశారు. వీటి ముద్రణలో చోటు చేసుకున్న తప్పిదాలతో విద్యార్థులు.. ఆందోళన చెందుతున్నారు.
డిగ్రీ పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ కు సంబంధించిన పటిష్టమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని సడలిస్తూ ఎస్వీయు ఇటీవల పరీక్షా కేంద్రాల సంఖ్యను సైతం పెంచింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 53పరీక్షా కేంద్రాలు ఉండగా ప్రస్తుతం మరో పది పెంచుతూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలను పెంచినట్లు పరీక్షల కార్యాలయం అదికారులు చెబుతున్నారు. తీరా హాల్ టిక్కెట్ల ముద్రణలో విద్యార్థుల జంబ్లింగ్ వివరాలు ఇష్టానుసారంగా పొందుపరిచారు. జరిగిన తప్పుకు.. సాంకేతిక లోపమంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులకు చిత్తూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. 15 నుంచి ఇరవై కిలోమీటర్లలోపే పరీక్షా కేంద్రాలను కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా.. తిరుపతి విద్యార్థులను 70కిలోమీటర్ల దూరంలోని చిత్తూరు పరీక్షా కేంద్రాలకు కేటాయిస్తూ హాల్ టిక్కెట్లు ఇచ్చారు. చిత్తూరులోని వివిధ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దాదాపు 70కిలోమీటర్ల అవతల ఉన్న పలమనేరులో పరీక్షా కేంద్రాలను కేటాయించారు.
సాధారణంగా హాల్ టిక్కెట్లు అంటే విద్యార్థికి సంబంధించిన ఫోటో కీలకం. దాని ఆధారంగానే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎస్వీయు విడుదల చేసిన డిగ్రీ హాల్ టిక్కెట్లలో విద్యార్థుల ఫోటోలు మాయమయ్యాయి. కొంతమంది ఏడు సబ్జెక్టులు రాయాల్సి ఉండగా హాల్ టిక్కెట్లలో కేవలం ఐదు సబ్జెక్టులనే పొందుపరిచారు. విద్యార్థులకు హాల్ టిక్కెట్ల క్రింద పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పొందుపరుస్తారు. నిబంధనల్లో కనీసం ఊరు పేర్లు కూడా మార్చకుండా అలాగే హాల్ టిక్కెట్లలో పొందుపర్చారంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 63పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఎస్వీయు నిర్ణయం తీసుకుంది. మొత్తం కలిపి 75వేల 727మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా కేంద్రాలకు ప్రత్యేకంగా కోడ్ నెంబర్లను ఎంపిక చేస్తారు. వీటి ఆధారంగానే ప్రశ్నా పత్రాల కేటాయింపులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రాల కోడ్ లు కీలకమౌతాయి. ఇక్కడే ఎస్వీయు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. చిత్తూరులోని విజేత డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి కోడ్ నెంబర్ 35ను కేటాయించారు. అదే నగరంలోని విజ్ఙాన సుధ డిగ్రీ కళాశాలకు సైతం కోడ్ నెంబర్ 35నే కేటాయించడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

