రాఫెల్‌పై పట్టువీడని రాహుల్‌ గాంధీ

రాఫెల్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా.. కాంగ్రెస్‌ మాత్రం బీజేపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తోంది. జస్టిస్‌ జోసెఫ్‌ తన తీర్పు ద్వారా రాఫెల్‌ స్కాంపై విచారణకు పెద్ద తలుపు తెరిచారంటూ ట్వీట్‌ చేశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి చిత్తశుద్దితో దర్యాప్తు ప్రారంభించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్‌ జోసేఫ్‌ తీర్పులోని 86 పేరాను రాహుల్‌ ప్రస్తావించారు. మరోవైపు సుప్రీం తీర్పు కేంద్రానికి క్లీన్‌ చీట్‌ కాదని, ఈ తీర్పు విషయంలో ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందంటూ విమర్శించారు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా. జస్టిస్‌ కేఎం జోసేఫ్‌ తీర్పు.. రాఫెల్‌ కుంభకోణంపై సమగ్ర నేర విచారణకు మార్గం సుగమం చేసిందన్నారాయన. మోదీ సర్కారుకు దమ్ముంటే స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

రాఫెల్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది బీజేపీ. ఈ తీర్పు నిజానికి దక్కిన విజయంగా అభివర్ణించారు ఆ పార్టీ నేతలు. . ఇదే సమయంలో రాహుల్‌గాంధీపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినవారికి ఇది గట్టి జవాబన్నారు హోంమంత్రి అమిత్‌షా. దేశం కంటే రాజకీయాలే ఎక్కువనుకునే కాంగ్రెస్‌ నేతలు.. క్షమాపణలు చెప్పాలంటూ అమిత్‌షా ట్వీట్‌ చేశారు.

దేశాన్ని రాహుల్‌ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారంటూ ఆరోపించారు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా. మరోవైపు సుప్రీం తీర్పును స్వాగతించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. దేశం ప్రథమం, దేశభద్రత ముఖ్యమని, కల్పిత ప్రచారం ఓడిపోయిందంటూ ట్వీట్‌ చేశారు.

Tags

Next Story