ఇద్దరు మహిళలను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట పట్టణంలో వివాహితపై అమానుషంగా నలుగురు వ్యక్తులు దాడి చేశారు. మేడవరపు రమాదేవి అనే మహిళకు చెందిన స్థల వివాదంలో ఘర్షణ జరుగుతుండగా.. రమాదేవి, ఆమె కోడలు పార్వతిలపై విచక్షణా రహితంగా కిరాయి రౌడీలు దాడి చేశారు.
వెంటక దుర్గా థియేటర్ పక్కనే నివాసముంటున్న మేడవరపు రమాదేవి, హరినాథరావు దంపతులకు చెందిన ఇంటి స్థలంపై.. గత కొన్ని నెలలుగా వివాదం జరుగుతోంది. అశ్వారావుపేటకు చెందిన కంచర్ల భాస్కరరావు అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించడం ఈ వివాదానికి కారణమైంది.
వివాదం కాస్తా ముదిరి చిలికి చిలికి గాలివానలా మారింది. రెండు రోజుల కిందట భాస్కరరావు పోలీసులను తీసుకుని వచ్చి.. వివాదంలో ఉన్న స్థలంలో కొబ్బరి చెట్లను నరికించి.. జేసీబీతో చదును చేయించాడు. ఆ సమయంలో ప్రతిఘటించిన బాధితులపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు.
ఇప్పుడు అదే స్థలంలో జేసీబీ సహాయంతో పనులు చేస్తుండగా అడ్డుకున్న బాధితులపై కిరాయి వ్యక్తులతో దాడి చేయించారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేశారు. మేడవరపు రమాదేవి, ఆమె కోడలు పార్వతిల జట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి మరీ దాడి చేశారు. అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి మరి అమానుషంగా దాడి చేశారు.
ఈ ఘటనపై అశ్వారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కబ్జాదారులకు అనుకూలంగా మాట్లాడుతూ తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

