కుల వృత్తులు, కూలీ పనులు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

కుల వృత్తులు, కూలీ పనులు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
X

Screenshot_1

48 వేల కార్మికులకు రెండు నెలలుగా జీతాల్లేవు. ఇల్లు గడిచే మార్గం తోచక కొందరు కుల వృత్తులు, కూలీ పనులు కూడా చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగం ఉందో లేదో తెలియక అభద్రత భావంతో ఉన్నారు. సమ్మె చేపట్టిన నాటి నుంచి ఇప్పటికే 23 మంది కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కార్మికులు. సమ్మె చట్టబద్ధత కాదని చెప్పబోమని ఇప్పటికే స్పష్టం చేసిన హైకోర్టు .. 15 రోజుల్లో లేబర్ కమిషన్ నిర్ణయం ప్రకటించాలని కూడా సూచించింది. అదే సమయంలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, కార్మికుల ఆత్మహత్యలు, జీతాభత్యాలపై ఇవాళ విచారణను కొనసాగించనుంది.

ఇక 5 వేల 100 రూట్లను ప్రైవేట్‌పరం చేస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో నిన్న వాడివేడి వాదనలు జరిగాయి. కేంద్ర మోటారు వాహనాల చట్టం..సెక్షన్-67 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం సర్కారుకు ఉందని పేర్కొంది. అలాంటప్పుడు ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. అయితే సెక్షన్- 102 ప్రకారం ఏ మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ నిర్ణయంతో ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం కేసీఆర్ చెప్పారని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హైకోర్టు... సీఎం ఏం చెప్పారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని అభిప్రాయపడింది..

ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా? అనేదే న్యాయస్థానం ముందున్న అంశమని వ్యాఖ్యానించింది . ప్రభుత్వం చట్ట పరమైన ప్రక్రియ అనుసరిస్తుందా లేదా అనేది తెలియకుండానే చట్ట విరుద్ధమని ఎలా ప్రకటిస్తామని ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం.. ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. కేబినెట్ నిర్ణయానికి ముందే ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలా లేక... తర్వాత ఇవ్వాలా అని ప్రశ్నించింది. ఏవైనా మార్పులు చేస్తే గెజిట్ లో ప్రచురించాలని, స్థానిక దినపత్రికల్లోనూ ప్రకటన ఇవ్వాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలన్నారు..అయితే రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని ప్రశ్నించింది హైకోర్టు..

ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని అభిప్రాయపడింది హైకోర్టు. గతంలో దేశంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేదని..ఆ తర్వాత కింగ్‌ ఫిషర్ వంటి కొన్ని సంస్థలు తప్ప చాలా ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు విజయవంతమయ్యాయని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Tags

Next Story