భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక టెస్టు మ్యాచ్.. వారికి అనుభవం లేదు..

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక టెస్టు మ్యాచ్.. వారికి అనుభవం లేదు..

Eden-Gardens

శుక్రవారం భారత్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా తొలి డే నైట్ టెస్టు ఆడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. అంతేకాదు పింక్ బాల్ ప్రవేశపెడుతున్నారు. తొలి డే నైట్ టెస్టుకు అటు బీసీసీఐతో పాటు ఇటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టెస్టు కోసం సాధారణంగా రెడ్‌ బాల్స్‌ వాడతారు. కానీ ఇప్పుడు పింక్‌ బాల్స్‌ను వాడతారు. ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. కానీ సారథి విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తొలిసారి పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడనుండటం విశేషం.

పింక్‌ బాల్‌ పైగా డే నైట్‌ మ్యాచ్‌ దీంతో ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. బెంగళూరులో రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం కోల్‌కతాలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన అనుభవం కొంతమందికి ఉండటం టీమిండియాకు లాభించే అంశం.

ఈ టెస్టులో ఆడబోతున్న క్రికెటర్లతో పాటు వ్యాఖ్యాతలు, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ పింక్ బాల్ టెస్టుపైనే చర్చిస్తున్నారు. రెండు రోజుల ముందే కోల్ కతాలో క్రికెట్ సందడి మొదలైంది. చారిత్రాత్మక తొలి టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్ భారీ ఏర్పాట్లు చేసింది. భారత ఆటగాళ్లకు అభిమానుల పింక్ టీ షర్ట్‌ల ధరించి ఘన స్వాగతం పలికారు. స్టేడియంలో జరిగే చారిత్రక టెస్టును చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. అభిమానుల నుంచి విశేష స్పందన రావడంతో ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబీ బంతితో జరిగే తొలి డే నైట్ టెస్టు మొదటి నాలుగు రోజుల టికెట్లు అమ్ముడుపోయాయని, తనకెంతో సంతోషంగా ఉందని దాదా అన్నారు. భారత్‌లో అతిపెద్దదైన క్రికెట్ మైదానం ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం 67వేలు. స్టేడియమంతా ఇప్పటికే గులాబీ రంగులతో మెరిసిపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story